విజయవాడలో లాక్‌డౌన్‌


విజయవాడ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాక్‌డౌన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ దృష్ట్యా విజయవాడలో పోలీసులు చర్యలు చేపట్టారు. నగరవ్యాప్తంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రధాన రహదారులను మూసివేశారు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ఆపి లాక్‌డౌన్‌కు సహకరించాలంటూ వెనక్కి పంపిస్తున్నారు.  అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. నగరవ్యాప్తంగా నిత్యావసరాలు, ఔషధ దుకాణాలు మినహా అన్ని దూకాణాలు మూతపడ్డాయి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నెలాఖరు వరకు అన్ని ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడలో నిరంతరం రద్దీగా ఉండే పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ ప్రయాణికులు లేక బోసిపోయింది. కొంతమంది ప్రయాణికులు బస్సులు నడుస్తాయని భావించి బస్‌ స్టేషన్‌కు వస్తున్నారు.
విజయవాడలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన దృష్ట్యా బస్టాండ్‌లో పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిరంతరం రసాయనాలతో పరిసరాలను శుద్ధి చేస్తున్నారు. బస్టాండు ఆవరణలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి ప్రజలకు సలహాలు ఇచ్చేందుకు వైద్యులను నియమించారు. కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లాక్‌డౌన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.